MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు.
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులని చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) తెలిపారు. ఒకేరోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేయించామని అన్నారు. తర్వాత వివిధ పనులని చేపట్టామని చెప్పారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ 339 పనులకు ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీల నేతలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ప్రధాన పనులని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో చేసిన పనులను ప్రజలకు వివరించడానికి ప్రత్యేకంగా ఓ బుక్లెట్ని రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.231 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. కొండాయపాలెం, భక్తవత్సలనగర్లలోని రైల్వేగేట్ అండర్ బ్రిడ్జిల పనులని త్వరలోనే ప్రారంభిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.