జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మాడుగుల మండలం కేజేపురం, వీరవిల్లి అగ్రహారం, ఘాట్రోడ్డు జంక్షన్, ఎం.కోడూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నక్కపల్లి మండలంలో కూడా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ
– సాయంత్రం జోరువాన
– మాడుగుల, నక్కపల్లిలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
– పాయకరావుపేట, ఎలమంచిలిలో రోడ్లు జలమయం
అనకాపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి/న్యూస్ నెట్వర్క్): జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మాడుగుల మండలం కేజేపురం, వీరవిల్లి అగ్రహారం, ఘాట్రోడ్డు జంక్షన్, ఎం.కోడూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నక్కపల్లి మండలంలో కూడా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
జిల్లాలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షం మొదలైంది. నక్కపల్లి మండలంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. నక్కపల్లి మండల కేంద్రంతో పాటు రాజియ్యపేట, ఉపమాక, బోయిపాడు, కాగిత, చినదొడ్డిగల్లు, జానకయ్యపేట, సీహెచ్ఎల్. పురం తదితర గ్రామాల్లో 10 విద్యుత్ స్తంభాలు, 30కి పైగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీని వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎలమంచిలి మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రేగుపాలెం గ్రామంలోని ముస్లిం కాలనీలో షేక్ మహాబూబ్ సుబానీకి చెందిన ఇంటి పోర్టికో కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం పిడుగు పడి ఒక పాడిగేదె, పెయ్యి మృతి చెందాయి. చినగోగాడ గ్రామానికి చెందిన కోనేటి సత్యనారాయణకు చెందిన పశువుల పాకల వద్ద పిడుగు పడడంతో ఈ సంఘటన జరిగింది. మాడుగుల మండలంలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే దారితో పాటు, విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘాట్రోడ్డు నుంచి గరికిబంధ వరకు రోడ్డుకు అడ్డంగా చెట్టుకొమ్మలు విరిగి పడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కోటవురట్ల మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగి ప్రవహించాయి. పాయకరావుపేటలో భారీ వర్షం కురవడంతో మెయిన్రోడ్డులో గౌతమ్ థియేటర్, లక్ష్మి ధియేటర్ సెంటర్ తదితర చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి, కశింకోట, మాకవరపాలెం, చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, ఎస్.రాయవరం మండలాల్లో కొద్దిసేపు ఒక మోస్తరు వర్షం పడింది. నర్సీపట్నం, గొలుగొండ, పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక, సబ్బవరం, దేవరాపల్లి, కె.కోటపాడులలో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఎండకు అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు.