Granite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు.
Granite Quarry Massive Explosion
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వీఆర్టీ గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులు తెర్లంగి రామారావు, బడబంద అప్పన్న, తమిళనాడుకు చెందిన వంగ వేణు ఆర్ముగంగా గుర్తించారు. క్వారీలో భారీ పేలుడు సంభవించిందని, ఆపై పిడుగుపడినట్లు వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.
ఇది సాధారణ ప్రమాదం కాదని పేలుడు కారణంగానే కార్మికులు మృతిచెందారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లి విచారణ ప్రారంభించారు. కార్మికుల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాత కార్మికుల మృతిపై అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే క్వారీలో ప్రమాదం జరగడంతో కార్మికుల భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఆయా క్వారీల యాజమాన్యాలు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఆయా క్వారీల్లో కార్మికుల రక్షణ గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ మేరకు క్వారీల్లో కార్మికుల భద్రతపై ఆయా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తనిఖీలు చేయాలని కార్మికుల కుటుంబ సభ్యులు విన్నవించారు.