Rahul Gandhi: 80వ దశకంలో దేశంలో సిక్కుల ఊచకోత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆ పార్టీకి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారింది. అలాంటి వేళ రాహుల్ గాంధీ ఇటీవల యూఎస్ పర్యటనకు వెళ్లారు.
న్యూఢిల్లీ, మే 04: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో చాలా తప్పులు చోటు చేసుకున్నాయని.. కానీ ఆ సమయంలో తాను అక్కడ లేనని లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. కానీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ హాయాంలో జరిగిన ప్రతి తప్పునకు బాధ్యత వహించేందుకు తాను సంతోషంతో సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్రౌన్ యూనివర్సిటీలోని వాట్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ కార్యాలయంలో విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. భారత్లో సిక్కులు తల పాగా ధరించేందుకు, కడా పట్టుకునేందుకు, గురుద్వారాలో ప్రవేశించేందుకు వారు చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందంటూ రాహుల్ గాంధీని ఒక యవకుడు సూటిగా ప్రశ్నించారు.
అలాగే బీజేపీ వల్ల సిక్కుల్లో భయాన్ని నెలకోల్పేందుకు మీరు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్తో ఓ యువకుడు పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయాలు ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. తాము కడలు ధరించడమే కాదు. తలపాగలు ధరించడంతోపాటు భావప్రకటన స్వేచ్ఛను సైతం తాము కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ దీనిని అనుమతించ లేదని స్పష్టం చేశారు.
అదే విధంగా దళిత హక్కులను సైతం అనంద్పూర్ తీర్మానం ప్రస్తావించిందని గుర్తు చేశారు. కానీ ఆ తీర్మానం.. వేర్పాటు వాదాన్ని ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ తీర్మానంపై వేర్పాటువాద అనే ముద్ర వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మీ పార్టీ ఈ విధంగా చేసిందని.. దీనిని ఈ పార్టీ ఒప్పుకొనేందుకు పరిణితి సైతం కనబరచలేదని పేర్కొన్నారు. 1984 నాటి అల్లర్లలో మీ పార్టీకి చెందిన సజ్జన్ కుమార్ను హత్య కేసులో దోషిగా కోర్టు తేల్చిందని తెలిపారు.
కానీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సజ్జన్ కుమారులు ఉన్నారని ఆ యువకుడు వ్యంగ్యంగా అన్నారు. కానీ మీరు సిక్కులతో సయోధ్యకు ప్రత్నించ లేదన్నారు. అందుకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఎందుకంటే.. మీరు ఇలాగే కొనసాగితే.. బీజేపీ సైతం పంజాబ్లోకి ప్రవేశిస్తోందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పైవిధంగా స్పందించారు.
80వ దశకంలో జరిగింది తప్పని తాను బహిరంగంగా చెప్పానని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తాను చాలా సార్లు స్వర్ణ దేవాలయానికి సైతం వెళ్ళానన్నారు. భారతదేశంలోని సిక్కు సమాజంతో తనకు చాలా మంచి సన్నిహిత సంబంధాలున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.