Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి, ఏప్రిల్ 29: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) అమరవీరులకు జనసేన (Janasena) సంతాపం ప్రకటించింది. మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar), ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు నేతలు మౌనం పాటించారు. ఉగ్రదాడి మృతులకు డిప్యూటీ సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అమాయకులను అత్యంత దారుణంగా చంపారన్నారు.
ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు. నిరాయుధులతో యుద్ధం చేయకూడదని తెలిపారు. ఎంతో నమ్మకంతోనే కశ్మీర్ పర్యటనకు వెళ్లారన్నారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.