ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద్ కన్నుమూశారు. ఆయన 128 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం యోగి సంతాపం తెలిపారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ (Padma Shri Baba Sivanand) శనివారం రాత్రి ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. బాబా శివానంద్ (128) కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఏప్రిల్ 30న బీహెచ్యూ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కబీర్నగర్ కాలనీలోని ఆయన నివాసంలో అంత్యక్రియల కోసం ఉంచారు. ఆయన శిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. శివానంద్ బాబా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ప్రధాని మోదీ సంతాపం
యోగా సాధకుడు, కాశీ నివాసి శివానంద్ బాబా జీ మరణం చాలా బాధాకరం. యోగా సాధనకు అంకితమైన ఆయన జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యోగా ద్వారా సమాజానికి సేవ చేసినందుకు ఆయనకు పద్మశ్రీ కూడా లభించింది. శివానంద్ బాబా నిష్క్రమణ కాశీ నివాసితులందరికీ ఆయన నుంచి ప్రేరణ పొందిన కోట్లాది మందికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో నేను ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు.