Char Dham Yatra 2025: చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ హాజరయ్యారు.
నైనిటాల్, మే 04: ఉత్తరాఖండ్లోని శ్రీ బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకోన్నాయి. జై బద్రీనాథ్ విశాల్ అంటూ లక్షలాది మంది భక్తుల జపిస్తుండగా.. గర్వాల్ రైఫిల్స్కు చెందిన భారత ఆర్మీ భక్తి సంగీతాన్ని వినుల విందుగా వాయిస్తుండగా ఈ దేవాలయం ద్వారాలు తెరుచుకున్నాయి. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ ఈ దేవాలయంలోకి ప్రవేశించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతోపాటు స్థానికులతో సీఎం పుష్కర్ సింగ్ సంభాషించారు. ఆ తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ చార్ ధామ్ యాత్ర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అలాగే భారీగా భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు. జోషి మఠ్ పునర్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరిన వెంటనే వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఆ క్రమంలో తొలి విడతగా రూ. 292 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఈ దేవాలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా దేవాలయ పరిసర ప్రాంతాల్లోని భక్తులపై పూల వర్షం కురిపించారు.