తిరుమల, ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 35 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
1.శ్రీ సత్య నారాయణ-హైదరాబాద్.
ప్రశ్న : లడ్డూ సేవను 65 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వండి. పరకామణి సేవలో పాల్గొన్నవారికి ప్రతిరోజూ దర్శనం కల్పిస్తే బాగుంటుంది?
ఈవో : పరకామణి సేవ చేసినవారికి ప్రతిరోజూ దర్శనం కల్పించడం సాధ్యంకాదు. లడ్డూసేవను గతంలో ప్రయత్నించినప్పటికి సరైన ఫలితాలు రానందున ఆపేయడం జరిగింది.
2.శ్రీ నాగశ్రీను-రాజమండ్రి.
ప్రశ్న : జూలై నెలలో దర్శనాలకు అదనపు కోటా విడుదల చేసే అవకాశం ఉందా?
ఈవో : ఆన్ లైన్ లో అదనపు కోటా విడుదల చేసే అవకాశంలేదు. కరెంటు బుకింగ్ లో మాత్రమే దర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయి.
3.ఉషారాణి-హైదరబాద్.
ప్రశ్న : సీనియర్ సిటిజన్ దర్శనాల్లో సహాయకులుగా మరొకరిని పంపించేందుకు వీలవుతుందా?
ఈవో : అలాంటి అవకాశం ఉండదు. సీనియర్ సిటిజన్లకు సహాయం అందించేందుకు శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు.
4.ప్రసాదరాజు-దేవరపల్లి.
ప్రశ్న : గతంలో తిరుమలలో సీఆర్వోలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో గదుల కేటాయింపు కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం సీఆర్వోలో మాత్రమే గదులు ఇస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు?
ఈవో : ఇతర ప్రాంతాల్లో గదుల కేటాయింపు వల్ల పలు సమస్యలు వస్తున్నాయని సీఆర్వోకే పరిమితం చేశాం. దీనిపై భక్తుల నుండి మంచి స్పందన వస్తోంది.
5.డాక్టర్ మనోజ్- చత్తీస్ఘడ్
ప్రశ్న : శ్రీవారి దర్శనానికి పారామిలిటరీ దళాలకు ప్రత్యేక అవకాశం కల్పించండి?
ఈవో : ఇప్పటికే ఆర్మడ్ ఫోర్స్ కు ఈ అవకాశం ఉంది. కోటా పెంచడం సాధ్యం కాదు. ఆర్మడ్ ఫోర్స్ కోటాలోనే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.
6.తిరుపతయ్య-హైదరాబాద్
ప్రశ్న: అఖిలాండ వద్ద చిరు వ్యాపారుల వద్ద భద్రతా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు?
ఈవో : వివరాలు తెలియజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
7.రేవంత్-అనంతపురం.
ప్రశ్న : సర్వ దర్శనానికి వచ్చి దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఏమైన ప్రత్యేక దర్శన సదుపాయం ఉందా?
ఈవో : ఇప్పటికే రోజుకు 750 టోకెన్లు వృద్ధులు, దివ్యాంగులకు జారీ చేస్తున్నాం. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించలేం.
- గిరిధర్-విజయవాడ.
ప్రశ్న: సీనియర్ సిటిజన్లకు వమో భారం దృష్ట్యా ఆలయానికి దగ్గరగా వసతి గదులు కేటాయింపు, అన్నప్రసాద కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది?
ఈవో : గదుల కేటాయింపు విషయంలో మీ సూచనను పరిశీలిస్తాం. అన్నప్రసాద భవనంలోని హాల్-1లో ఇప్పటికే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
9.గోపాల్ రెడ్డి-హైదరబాద్.
ప్రశ్న : బ్రహ్మోత్సవాల్లో దాతల దర్శన కోటా రద్దు చేస్తున్నారు?
ఈవో : భక్తుల అధిక రద్దీ కారణంగా దాతల దర్శన కోటాను రద్దు చేస్తున్నాం.
10.అరుణ్-హైదరబాద్.
ప్రశ్న : తాము అర్చన టికెట్ బుక్ చేసుకునే సమయానికి మా అబ్బాయికి 12 ఏళ్లు ఉండేవి. దర్శనాకి వచ్చేటప్పటికి 13 ఏళ్లు నిండటంతో అనుమతివ్వడం లేదు. ఇలాంటి వారికి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా?
ఈవో : నిబంధనలను సడలించడం సాధ్యం కాదు.
- సుధాకర్-కడప.
ప్రశ్న : దివ్యాంగులను వీల్ చైర్ లో ఆలయం లోపలకి అనుమతించండి?
ఈవో : ఆలయంలో స్థలాభావం వల్ల సాధ్యం కాదు.
- బిందు-హైదరాబాద్.
ప్రశ్న : శ్రీవారి పుష్కరిణీలో పరిశుభ్రత పాటించడంలేదు. సబ్బులు, షాంపులతో స్నానం చేస్తున్నారు?
ఈవో : విచారించి చర్యలు చేపడతాం.
- నారాయణ-ఒంగోలు. గోపి-ఖమ్మం.
ప్రశ్న : దేశ రక్షణకు ఒక సంవత్సర హుండీ ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి. క్యూలైన్లలో 5-10 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయండి?
ఈవో : పిల్లలకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం.
- రవి కుమార్-కావలి.
ప్రశ్న : టీటీడీ నేత్ర దాన ట్రస్టు ఏర్పాటు చేస్తే ఎంతో మంది భక్తులకు మేలు జరుగుతుంది?
ఈవో : ఈ అంశంపై ఇప్పటికే అరవింద్ కంటి ఆసుపత్రితో చర్చలు జరుపుతున్నాం. త్వరలో విధివిధానాలు ప్రకటిస్తాం.
- మహేశ్వరరావు-నర్సారావు పేట.
ప్రశ్న : ఎస్ఎస్డీ టోకెన్లు రాత్రి సమయంలో జారీ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం?
ఈవో : భక్తుల సూచన మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- నర్సా నాయుడు-అనంతపురం.
ప్రశ్న : శ్రీవారి మెట్టు వద్ద నడకదారిని వచ్చే భక్తులందరికీ టోకెన్లు ఇవ్వండి?
ఈవో : ఇప్పటికే రోజుకు 3 నుండి 4వేల వరకు టోకెన్లు జారీ చేస్తున్నాం. ఆ సంఖ్యను పెంచితే సర్వ దర్శన భక్తులకు ఇబ్బంది కలుగుతుంది.
- నామాలస్వామి-కాకినాడు. శ్యామల కుమార్-కామారెడ్డి.
ప్రశ్న : శ్రీవారి సేవకు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అవకాశం ఇవ్వండి?
ఈవో : ఆఫ్ లైన్ లో ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆన్ లైన్ లో ఇస్తున్నాం. శ్రీవారి సేవలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం.
- లక్ష్మీ నారాయణ-హైదరబాద్.
ప్రశ్న : శ్రీనివాస మంగాపురంలో వేద ఆశీర్వచనాన్ని ఏక బ్రాహ్మణుడే ఇస్తున్నాడు?
ఈవో : ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.