శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు శుభ వార్త తెలిపారు
శ్రీశైలం మల్లన్నఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాలలో ఉదయం,రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో ఇకపై శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఆ మూడ్రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు.
ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవల ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, వసతి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించేందుకు వైదిక కమిటీ, అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.